హైదరాబాద్లోని రాజ్భవన్లో ఆషాడమాసం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ప్రాంగణంలోని అమ్మవారి ఆలయం వేదిక అయింది. ఉత్సవాల్లో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా బోనమెత్తారు. ఈ క్రమంలో శనివారం తొలుత గవర్నర్ తన తలపై సంప్రదాయ బోనం మోస్తూ రాజ్భవన్ పరివార్ సభ్యులతో కలిసి అధికారిక నివాసం నుంచి ప్రాంగణంలోని ఆలయానికి ఊరేగింపుగా వచ్చారు. ఆలయం లోని నల్ల పోచమ్మ అమ్మవారికి సంప్రదాయ బోనం సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్భవన్ సిబ్బంది ఈ ఉత్సవంలో పాల్గొనగా, రాజ్భవన్లో నివసించే కుటుంబాలతో కలిసి గవర్నర్ తమిళిసై ఉత్సాహంగా బోనాల పండుగ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంగణమంతా బోనాల వైభవాన్ని తెలిపే తెలంగాణ జానపద శైలి గీతాలు అలరించగా, రాజ్భవన్ పండుగ శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. “మాత మహంకాళి యొక్క దైవిక ఆశీర్వాదం కారణంగా, కోవిడ్-19 మహమ్మారి చాలా వరకు అదుపులో ఉంది. ప్రజలంతా సాధారణ జీవితానికి రావడంతో ఈ ఏడాది బోనాల పండుగను జరుపుకునేందుకు ప్రజలు నిర్భయంగా ఆలయాలకు తరలివస్తున్నారు. మన దేశం మరియు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజలందరి శ్రేయస్సు కోసం నేను ప్రార్థించాను” అని పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్లో జరిగిన బోనాలు రాష్ట్ర పండుగ వేడుకల్లో గవర్నర్ కార్యదర్శి కె. సురేంద్రమోహన్, ఇతర ఉన్నతాధికారులు గవర్నర్తో కలిసి పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ