తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి (80) కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతిమ నివాళుల కోసం ఆమెను సాయంత్రం విమానంలో చెన్నైలోని సాలిగ్రామంలోని నివాసానికి తీసుకువస్తున్నామని చెప్పారు. గురువారం చెన్నైలో అంత్యక్రియలు జరుగుతాయని గవర్నర్ తెలిపారు.
రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణ కుమారి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే గవర్నర్ మాతృమూర్తి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం తెలియజేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ