విద్యార్థులు మరియు స్కాలర్స్ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. దేశంలో మార్పులు మరియు సర్వతోముఖ ప్రగతికి ఆవిష్కరణలు కీలకమని, స్వావలంబన భారతదేశం యొక్క లక్ష్యాన్ని సాధించడానికి అన్ని స్థాయిలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బుధవారం ఉస్మానియా క్యాంపస్లోని యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్గా వ్యవహరిస్తున్న డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొని ప్రసంగించారు. ఎప్పుడూ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విద్యార్థులను గవర్నర్ చైతన్యపరిచారు. సవాళ్లను ఎదుర్కొనే వారు మరింత దృఢంగా మారతారని పేర్కొన్నారు. విద్యార్థులు కఠినమైన సవాళ్లను ఎదుర్కోవటానికి ఇబ్బంది పడకూడదని, మరియు దృఢమైన వ్యక్తులుగా ఎదగాలని సూచించారు. చిన్నచిన్న సమస్యలతో డిప్రెషన్కు లోనుకావద్దని చెప్పారు.
ఉస్మానియా యూనివర్శిటీని 100 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థగా అభివర్ణిస్తూ, విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు విశ్వవిద్యాలయంతో తమకున్న అనుబంధాన్ని గర్వంగా భావించి, దాని అభివృద్ధికి తిరిగి సహకరించాలని అన్నారు. డిగ్రీలు, బంగారు పతకాలు పొందుతున్న విద్యార్థులు, స్కాలర్స్ తమ జీవితాన్ని శ్వేతపత్రంలా భావించి తమ కృషితో చరిత్రను రాసి మంచి వ్యక్తులుగా నిలవాలని గవర్నర్ కోరారు. అలాగే డిఫరెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి కాన్వొకేషన్ ఉపన్యాసం చేశారు. వివిధ విభాగాల్లో విజేతలకు డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేయడంతోపాటు బంగారు పతకాలను బహూకరించిన ఈ స్నాతకోత్సవంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్, అధికారులు, సీనియర్ విద్యావేత్తలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ