తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 25 తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటుగా బతుకమ్మ పండగ ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బతుకమ్మ వేడుకల ప్రారంభ సందర్భంగా తెలంగాణ మహిళలందరికీ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ అనేది ప్రకృతి మాతతో ముడిపడి ఉన్న చాలా ప్రత్యేకమైన పండుగని గవర్నర్ అన్నారు.
“బతుకమ్మ అనేది స్థానిక తెలంగాణ సంస్కృతి మరియు సంప్రదాయాలకు నిజమైన నిదర్శనం. ఇక్కడ మహిళలు బతుకమ్మ రూపంలో గౌరీ దేవి (పార్వతి దేవి)కి ప్రార్థనలు చేస్తారు. సెప్టెంబర్ 25న మహిళా జర్నలిస్టులు, వైద్యులు, కళాకారులు, అనేక ఇతర రంగాలకు చెందిన అనేక మంది మహిళలతో మరియు సెప్టెంబర్ 26న రాజ్భవన్లో రాజ్భవన్ పరివార్ మహిళలతో బతుకమ్మ నేను కూడా జరుపుకుంటాను. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు” అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.
మరోవైపు బతుకమ్మ వేడుకల్లో భాగంగా రాజ్భవన్పరివార్ సభ్యులకు వ్యక్తిగతంగా చీరలను ఎంపిక చేసి బహుమతిగా ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ శనివారం దర్బార్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్భవన్లోని మహిళా సిబ్బంది అందరికీ గవర్నర్ తమిళిసై చీరలను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రత్యేక పూల పండుగ బతుకమ్మలో మహిళలకు పౌష్టికాహారం ఇచ్చిపుచ్చుకోవడం అంతర్లీనంగా ఉందని ఆమె అన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేసిన వివిధ రకాల పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను ఇచ్చిపుచ్చుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని గవర్నర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY