తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. ఈ నూతన మద్యం విధానానికి సంబంధించి అక్టోబర్ 4, గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విధానం నవంబర్ 1, 2019 నుంచి అక్టోబర్ 30 2020 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. ఇందులో జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. గతంలో అమలులో ఉన్న 4 స్లాబులను ఇప్పుడు 6 స్లాబులుగా మార్చారు. జనాభా 5వేల లోపు ఉన్న ప్రాంతాలలో లైసెన్స్ ఫీజును రూ.50 లక్షలగా నిర్ణయించారు. ఇక 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలలో రూ.55 లక్షలు గానూ, 50 వేల పైబడి లక్ష లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60 లక్షలు గానూ, లక్ష నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల మొదలు 20 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.85 లక్షలు మరియు 20 లక్షలకు పైబడి జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే విధానంలో భాగంగా, నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును ప్రభుత్వం రూ.2 లక్షలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2,216 మద్యం దుకాణాలకు లాటరీ పద్దతిలో దుకాణదారులను ఎంపిక చేయబోతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతే కాకుండా మద్యం దుకాణాలు తెరచి ఉంచే సమయాలపై కూడ ప్రభుత్వం కొత్త ఆదేశాలు ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి నిచ్చారు. ఇక ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది.
[subscribe]