800 సంవత్సరాల క్రితం మన తెలంగాణను పాలించిన కాకతీయుల గొప్ప చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే ‘కాకతీయ వైభవ సప్తాహం’ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియా సమావేశంలో ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో నివసిస్తున్న కాకతీయ వంశ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ చేతుల మీదుగా సప్తాహాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రేపు ఉదయం 8 గంటలకు భంజ్ దేవ్ వరంగల్కు వస్తున్నారని, భద్రకాళీ అమ్మవారి ఆలయం దగ్గర ఆయనకు ప్రభుత్వం తరపున భారీ స్వాగత ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
అమ్మవారి దర్శనం అనంతరం పోచంమైదాన్లో ఉన్న రాణీ రుద్రమ విగ్రహానికి భంజ్ దేవ్ పూలమాల వేసి అభివాదం చేస్తారని తెలిపారు. అనంతరం ఖిలా వరంగల్, వేయిస్తంబాల గుడి, ఆగ్గిలయ్య గుట్టను సందర్సించి భోజన విరామం అనంతరం హైదరాబాద్కు వెళ్తారని చెప్పారు. ఈ క్రమంలో రేపు సాయంత్రం మాదాపూర్లోని ఆర్ట్స్ గ్యాలరీలో 777 కాకతీయ రాజుల ఫోటో ఎగ్జిబిషన్ భంజ్ దేవ్ సందర్శిస్తారని వెల్లడించారు. ఈ ఏడు రోజులపాటు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ క్రమంలో జూలై 8 నుంచి 12 వరకు ప్రతిరోజు హనుమకొండలోని వేణుమాధవ్ ఆడిటోరియంలో నాటకోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక చివరిగా 13న రామప్పలో కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాల ముగింపు సభ ఉంటుందని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ