తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది. కరోనా పంపిణీ విషయంలో రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర స్టీరింగ్ కమిటీతో పాటుగా రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయడం, వ్యాక్సిన్ అందజేసే వారి డాటా బేస్ సిద్ధం చేయడం, వ్యాక్సిన్ పంపిణీకి కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, రవాణా, అవసరమైన నిధులను సమకూర్చడం, వ్యాక్సిన్ వేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం సహా పలు అంశాలకు సంబంధించిన వ్యవహారాలను ఈకమిటీలు పర్యవేక్షించనున్నాయి. ఇక రాష్ట్ర స్టీరింగ్ కమిటీకి చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కన్వీనర్ గా వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీకి వైద్యారోగ్యశాఖ కార్యదర్శి చైర్మన్గా, రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకుడు కన్వీనర్గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్గా జిల్లా వైద్య శాఖ అధికారి, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా మండల పరిషత్ అభివృద్ధి అధికారి, కన్వీనర్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ ఉండనున్నారు. ఈ కమిటీలలో చైర్మన్, కన్వీనర్ లతో పాటుగా పలు విభాగాలకు చెందిన సభ్యులు ఉండనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నాలుగు కమిటీల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ