దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్పై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో విచారణ బృందాన్ని నియమించారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో రాచకొండ అడిషనల్ డీసీపీ సురేందర్రెడ్డి, రాచకొండ ఐటీ సెల్కు చెందిన శ్రీధర్రెడ్డి, మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, వనపర్తి ఎస్పీ కె.అపూర్వరావు, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్రెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, సంగారెడ్డి డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం ఈ సిట్ను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ జరిగిన తీరు, అందుకు దారి తీసిన కారణాలపై సిట్ దర్యాప్తు చేసి కోర్టుకు నివేదికను సమర్పించనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి డిసెంబర్ 8, ఆదివారం నాడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్పై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. డిసెంబర్ 11న ఈ కేసుపై వాదనలు వింటామని కోర్టు పేర్కొంది. అలాగే ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సభ్యులు కూడా విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్హెచ్ఆర్సీ సభ్యులు బృందం మొదటిరోజున మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి చేరుకుని, అక్కడ భద్రపరిచిన మృతదేహాలను పరిశీలించారు. అనంతరం చటాన్పల్లి వంతెన దగ్గర ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కూడా ఎన్హెచ్ఆర్సీ సభ్యులు సందర్శించారు. రెండో రోజున దిశ తండ్రి, సోదరిని విచారించి వివరాలు సేకరించారు. నిందితుల ఎన్కౌంటర్పై వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
[subscribe]