తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ దంపతులు డిసెంబర్ 9, సోమవారం నాడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఆలయ ఈవో, అధికారులు, వేదపండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం అర్చకులు వారికీ వేదాశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ డిసెంబర్ 9, 10,11 తేదీలలో మూడు రోజులపాటు వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా హనుమకొండ చేరుకొని రెడ్క్రాస్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ తలసేమియా సెంటర్ ఎక్స్టెన్షన్ బ్లాక్ కోసం శంకుస్థాపన చేసి రెడ్క్రాస్ సొసైటీ సభ్యులతో సంభాషించనున్నారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక వెయ్యి స్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం మరియు వరంగల్ కోటను సందర్శిస్తారు.
అనంతరం హోటల్ హరితా కాకతీయలో విశ్రాంతి తీసుకుని మంగళవారం నాడు భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా కటరం మండలంలోని బోడగూడెం గ్రామాన్ని సందర్శిస్తారు. అనంతరం ఆమె కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కూడా వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శనకు బయలుదేరే ముందు పురాతన కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై పెద్దపల్లి జిల్లాకు బయలుదేరతారు. గవర్నర్ పర్యటనలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఆమెతో పాటు పాల్గొననున్నారు.
[subscribe]