ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగబోతున్నాయి. బస్సు ఛార్జీలు పెంచే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదముద్ర తెలిపినట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి, ఆర్టీసీని బతికించాలనే ఉద్దేశంతోనే చార్జీలను పెంచుతున్నామని, పెరిగిన ధరలు ఏ తేదీ నుంచి అమలులోకి వస్తాయో త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. పల్లె వెలుగు మరియు సిటీ సర్వీస్ బస్సుల్లో ప్రతి కిలోమీటర్కు రూ.10 పైసలు, ఇతర బస్సు సర్వీసులకు కిలోమీటర్కు రూ.20 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీ యొక్క బకాయిలు రూ.6735 కోట్లు ఉన్నాయని, ఆర్టీసీకి ఏటా రూ.1200 కోట్ల నష్టం వస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ఆర్టీసీ ఈ విధంగా నష్టాలలోకి చేరుకుందని పేర్ని నాని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్ని నాని తెలిపారు.
[subscribe]