హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో గల నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగు పరచడం కోసం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారంనాడు సమీక్ష నిర్వహించారు. మొదటిసారిగా నిమ్స్ లోని అన్ని శాఖల హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ లతో సమీక్ష జరిపారు. ప్రజలపై భారం పడకుండా మూత్రపిండాలు, గుండె, కాలేయం, రుమటాలజీ వైద్య సేవలు మరింత మెరుగుపరచాలని సూచించారు. అవయవ మార్పిడి సమర్థవంతంగా చేస్తున్న డాక్టర్స్ ను మంత్రి అభినందించారు. గుండె రంధ్రాలు, చిన్న వయసులో కిడ్నీ సమస్యలు, లివర్ ఫెయిల్యూర్, బ్రెయిన్ హెమరేజ్ వీటికి చికిత్స అందించడం ద్వారా 70 శాతం సమస్యలు పరిష్కారం అవుతుంది అని మంత్రి అన్నారు.
నిమ్స్ కు వచ్చిన పేషంట్ ను తిరిగి వెనక్కు పంపొద్దు, నిమిషాల్లోనే అడ్మిట్ చేసుకోవాలి:
“నిమ్స్ కి వచ్చిన ప్రతి పేషంట్ కి చికిత్స అందించాలి. నిమ్స్ కి వచ్చిన పేషంట్ ను తిరిగి వెనక్కు పంపించవద్దు. వచ్చిన నిమిషాల్లోనే అడ్మిట్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారు గంటల కొద్దీ వేచి చూసే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలి. నిమ్స్ పేరును మరింత ఇనుమడింప చేసేలా డాక్టర్స్ అందరూ పని చేయాలి. పేషంట్ కి, పేషంట్ అటెండెంట్ కి డాక్టర్స్, కౌన్సిలర్స్ ఎప్పటికప్పుడు పేషంట్ కండిషన్ వివరించాలి. ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడాలి. ప్రతి హాస్పిటల్లో పేషంట్ కౌన్సిలర్స్ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. రూ.7500 కోట్ల బడ్జెట్ తో 80 వేల సిబ్బందితో అనునిత్యం ప్రజలతో సంబంధం ఉన్న డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ. ఈ శాఖను మరింత చేరువ చేయాల్సిన భాధ్యత మనందరిదీ. కోవిడ్ పాండమిక్ డాక్టర్ ను దేవుణ్ణి చేసింది. కోవిడ్ నుంచి ప్రజల ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ వైద్యుల పట్ల గర్వ పడుతున్నాం” మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ తో పాటు నిమ్స్ లో ఉన్న అన్ని శాఖల అధిపతులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ