తెలంగాణలోని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. సోమవారం ఆయన సిద్దిపేట మెడికల్ కళాశాలలోని మొదటి పీజీ బ్యాచ్ (2022-23) జీజీ స్టూడెంట్స్ ఇంట్రడక్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారని, మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి పీజీ బ్యాచ్ ఇదే అని, వారందరూ భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని హరీశ్రావు సూచించారు. అలాగే జూనియర్లతో స్నేహపూర్వకంగా మెలగాలని, వారు వైద్య విద్యలో విజయవంతంగా రాణించేలా సలహాలు ఇవ్వాలని హరీశ్రావు సూచించారు. వైద్య విద్యలో సిద్దిపేటను జాతీయ స్థాయిలో రోల్ మోడల్ గా నిలపాలని ఆకాంక్షించారు.
దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా లాంటి కాలేజీలకే ఏడాదికి కేవలం మూడు, నాలుగు పీజీ సీట్లు వస్తాయని, అయితే తొలి ఏడాదిలోనే సిద్దిపేట మెడికల్ కాలేజీకి రికార్డ్ స్థాయిలో 57 పీజీ సీట్లు వచ్చాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో 2,950 అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఉండేవని, రాష్ట్రం ఏర్పడ్డాక ఆ సంఖ్య 6,715కు పెరిగిందని తెలిపారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో 1180 పీజీ సీట్లు ఉండేవని, అయితే ఇప్పుడు అది 2501కి చేరిందని వెల్లడించారు. ఇక ఒకప్పుడు కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా.. రాష్ట్రం ఏర్పడ్డాక 17 మెడికల్ కాలేజీలు వచ్చాయని, వీటిలో ఈ ఒక్క సంవత్సరమే 12 కాలేజీలను ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది మరో 9 కాలేజీలను ప్రారంభించనున్నామని, త్వరలోనే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ