ప్రపంచవ్యాప్తంగా చైనా సహా పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి, కరోనా సన్నద్ధతపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం జూమ్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కరోనా పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, కరోనా వాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, ప్రికాషన్ డోసు వేసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సందర్భంగా వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బి.ఎఫ్ 7 వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం కరోనాపై ఆరోగ్య శాఖ సన్నద్ధత పై మంత్రి సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు సర్వం సంసిద్ధంగా ఉందని, ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురి కావద్దని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిశా నిర్ధేశంతో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కరోనా ను విజయవంతంగా ఎదుర్కొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలచిందన్నారు. కరోనా వ్యాప్తి ప్రస్తుతం తెలంగాణలో లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. మానవ వనరులు, మందులు, ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలని, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి.శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE