తెలంగాణ ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం నేటినుంచి ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కామారెడ్డిలో బుధవారం దీనిని ప్రారంభించారు. కామారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు స్థానిక నేతలు, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, గర్భిణుల కోసం ఇప్పటికే ‘కేసీఆర్ కిట్స్’ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. దీనితో పాటు వారి కోసం కొత్తగా ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్’ అనే మరో పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించుకున్నామని, ఈ కిట్స్ ద్వారా గర్భిణులకు పౌష్టికాహార కిట్ను కూడా అందజేయనున్నామని తెలిపారు.
ఇంకా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈ కిట్లలో రూ.1,962 విలువైన మంచి బలవర్ధకమైన పోషకాహారం ఉంటుందని, దీనికోసం ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి రెండుసార్లు ఈ కిట్ను అందిస్తామని, గర్భిణీ స్త్రీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈరోజు మొత్తం 9 జిల్లాల్లో ఈ కిట్ల పంపిణీ ప్రారంభిస్తున్నామని, మిగిలిన 8 జిల్లాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రొటీన్స్ , మినరల్స్ , విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం ద్వారా రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం ఈ కిట్ల లక్ష్యమని తెలిపిన మంత్రి, తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని చెప్పారు. ఈ కిట్లో 1కేజీ ఖర్జురాలు, నెయ్యి, సిరప్స్, ప్రోటీన్స్ వంటివి అందజేస్తున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
మొత్తం రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయనున్నామన్న మంత్రి, ఒకో కిట్కు ప్రభుత్వం రూ.1,962 ఖర్చు చేయనున్నదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం, వ్యాద్యారోగ్య సిబ్బంది చేపట్టిన ప్రత్యేక చర్యల కారణంగా రాష్ట్రంలో డెలివరీ సమయంలో సంభవించే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గిందని, దీనిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మన రాష్ట్రానికి అవార్డు కూడా ప్రకటించిందని మంత్రి హరీశ్ రావు తెలియజేశారు. ఇక మొదటి కిట్ను 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ సమయంలో ఇస్తామని, రెండోకిట్ను 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో అందజేస్తామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా దాదాపు 1.25 లక్షల మంది గర్భిణులకు మేలు జరుగనుందని, 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ