ఇద్దరు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో వారి రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికోసం పోలింగ్కు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి ఎవరిని అదృష్టం వరించనుందన్నది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఆయా పార్టీల్లో ఎవరికి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీకి వచ్చాయి. అయితే.. స్థానాలు రెండే అయినప్పటికీ వాటిని గెలిచేందుకు ఆయా పార్టీలు ఎత్తులు, జిత్తులు వేస్తున్నాయని తీవ్రమైన స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ స్థానాలు ఎమ్మెల్యేల బలంతో గెలిచేవి కాబట్టి.. ఇదే అదునుగా కొందరిని తమ వైపు లాక్కునేందుకు కాంగ్రెస్, బీఆర్ ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వారు మొదలు పెడితే తానూ తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
అసెంబ్లీలో119 మంది ఎమ్మెల్యేలుండగా, ఒక ఎమ్మెల్సీని గెలుచుకోవాలంటే 40 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. పార్టీల బలాబలాల్ని బట్టి చూస్తే అధికార పార్టీ కాంగ్రెస్కు కచ్చితంగా ఒక స్థానంతో పాటు ఇంకా అదనపు సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేలుండటం తెలిసిందే. బీఆర్ఎస్ బలం 39 మాత్రమే కావడంతో ఆపార్టీకి ఒక్కసీటు దక్కడమూ కష్టమే. ఇప్పటిదాకా ఎంఐఎం మిత్రపక్షంగా ఉన్నందున ఆపార్టీకున్న ఏడుగురు సభ్యుల మద్దతు ఉంటుంది కనుక ఒక సీటు గెలుస్తుందని భావిస్తున్నారు. అయితే ఎంఐఎం ఓటింగ్లో పాల్గొనకపోయినా, బీఆర్ఎస్లోనే క్రాస్ ఓటింగ్ జరిగినా ఒక్క సీటు కూడా దక్కదు. గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో దెబ్బతినడాన్ని రాజకీయా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఒకసారి , కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. దాంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సుదర్శన్రావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్కు సంఖ్యాబలం కంటే తక్కువమంది సభ్యులున్నప్పటికీ, అదనంగా ఒకరు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈసారి అది రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగిల్ గానే మేజిక్ ఫిగర్ సాధించి అధికారం పీఠం ఎక్కినా.. మనకేం కాదు అనే ధీమా ఉండే స్థితిలో అయితే ఎమ్మెల్యేల సంఖ్య లేదు. ఈ క్రమంలోనే మొదటి నుంచీ ప్రభుత్వం నిలబడడంపై అనేక ఊహాగానాలు, పలువురు నేతల స్టేట్ మెంట్లు ఉంటూనే ఉన్నాయి. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మేరకు అవకాశాలు ఉన్నాయనేది తేలిపోనుంది. ప్రస్తుతానికి బీఆర్ ఎస్ కు అలాంటి ఉద్దేశం, అంత సాహసం చేసే చాన్స్ లేకపోయినప్పటికీ.. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకంటాయో తెలీదు కాబట్టి రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.
క్రాస్ ఓటింగ్ సంగతి అలా ఉంచితే.. కాంగ్రెస్కు ఒక సీటు పక్కా. బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతుతో ఒక సీటు కచ్చితంగా దక్కుతాయనే ఆశలున్నాయి. దీంతో రెండు పార్టీల నుంచి పలువురు ఆశావహులు ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎంతోకాలంగా పార్టీకి విధేయులుగా ఉన్నవారు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లు రాని వారు, వేరే వారి కోసం సిట్టింగ్గా ఉన్నప్పటికీ టిక్కెట్ను త్యాగం చేసిన వారు, పోటీ చేసి అవిరళంగా కృషి చేసినప్పటికీ ఓటమి పాలైన వారు, తదితరులెందరో ఉన్నారు. ఆయా సందర్భాల్లో రెండు పార్టీలూ వారికి హామీలిచ్చాయి. దీంతో ఈ సారి అదృష్టం వరించగలదని ఎదురు చూస్తున్నవారు వందమందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. పదుల పేర్లు మాత్రం ప్రముఖంగా వినపడుతున్నాయి.
అలాంటి వారిలో కాంగ్రెస్ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్కుమార్గౌడ్, జగ్గారెడ్డి, ఫిరోజ్ఖాన్, షబ్బీర్అలీ, అజారుద్దీన్, అలీ మస్కతి, వేంనరేందర్రెడ్డి, అద్దంకి దయాకర్, బండ్ల గణేశ్, అందెశ్రీ, సంపత్, మధుయాష్కీగౌడ్, వేణుగోపాల్ తదితరులున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మదన్రెడ్డి, గంపా గోవర్ధన్, ఆత్రం సక్కు, జి.నగేశ్, పీఎల్ శ్రీనివాస్లతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్యే కోసం నామినేట్ చేసినప్పటికీ పెండింగ్లో ఉన్న దాసోజు శ్రవణ్, కె.సత్యనారాయణలు సైతం ఉన్నట్లు సమాచారం. ఇందరిలో ఆ రెండు సీట్లు పొందనున్నదెవరన్నది చర్చనీయాంశంగా, రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE