ఆంధ్రప్రదేశ్లో సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం తనను కలుసుకున్న సిక్కు మత పెద్దలకు తెలియజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం సిక్కు మత పెద్దలు కొందరు సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. కాగా సీఎం జగన్ను కలిసిన సిక్కు ప్రతినిధి బృందంలో సిక్కు కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎస్ హర్మీందర్ సింగ్, శ్రీ గురు సంఘ్ సభ అధ్యక్షుడు ఎస్ కన్వల్జీత్ సింగ్, పింకీ హర్విందర్ సింగ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు తమ కమ్యూనిటీకి చెందిన పలు సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. వారి విజ్ఞప్తులపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.
గురుపురబ్ (గురునానక్ జయంతి) సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున అధికారికంగా సెలవు ప్రకటించడానికి సీఎం జగన్ అంగీకారం తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఏపీలోని అన్ని సిక్కు మతస్తుల ప్రార్ధనా మందిరాలకు (గురుద్వారాలకు) ఆస్థిపన్ను మినహాయింపు ఇచ్చిన ఆయన.. అధికారులకు ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గురుద్వారాలలో పూజలు నిర్వహించే గ్రంధీలకు.. ఇతర మతాలకు చెందిన పూజారులు, పాస్టర్లు, మౌల్వీలు మాదిరిగానే ప్రభుత్వం తరపున ప్రయోజనాలు కలిగించనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే సిక్కు సామాజిక వర్గంలోని పిల్లల విద్య కోసం ఒక మైనారిటీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు సహాయం అందిస్తామని, ఇంకా సిక్కు వర్గంలోని ఔత్సాహిక యువతకు పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందిస్తామని కూడా సీఎం జగన్ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE