గత వారం నుంచి తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మెదక్లో పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కీలక సమీక్ష నిర్వహించారు. గురువారం మెదక్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వర్షాలు, వరదలు తాజా పరిస్థితుల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు సదా అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అవసరమైనచోట సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని హరీష్ రావు ఆదేశించారు.
మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా రోడ్లు బాగా దెబ్బతిన్నాయని, పలు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోందని హరీష్ రావు తెలిపారు. దూప్సింగ్ తండాలో రోడ్లు దెబ్బతిని రాకపోకలు బంద్ అయ్యాయని, అక్కడ శాశ్వతంగా బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మరోవైపు నర్సాపూర్ లో కోర్టు భవనం కూలిపోవడంతో తాత్కాలికంగా సీడీపీఓ భవనాన్ని కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 370 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, ఒక్కొక్క ఇంటికి రూ. 3,200 పరిహారం చెల్లిస్తామని అన్నారు. ఇక వర్షాకాలం ప్రారంభమయ్యేలోపే యాసంగి ధాన్యాన్ని కొనుగోళ్లు పూర్తి చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు. అలాగే రాష్ట్రంలో రైతు బంధు ద్వారా ఒక్కొక్క రైతుకి రూ. 7,500 పంటసాయం అందించామని మంత్రి హరీష్ రావు గుర్తుచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ