వరుణ దేవుడు శాంతించి వర్షాలు తగ్గాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన వరుణ శాంతి హోమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఈ నెల 17వ తేదీన మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీ పనులను మగ్గంపై మంత్రి ప్రారంభించారు. తదనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సికింద్రాబాద్ పరిధిలోని 91 దేవాలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువులు పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. గోదావరి నది గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుందని అన్నారు. వరుణ దేవుడు శాంతించాలని కోరుతూ వరుణ శాంతి హోమం నిర్వహించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సంవత్సరం బోనాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని, 3500 దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జూలై 17న సికింద్రాబాద్ బోనాలు నిర్వహించనున్న నేపథ్యంలో 91 దేవాలయాలకు 76 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. జూలై 24 వ తేదీన బోనాలు నిర్వహించనున్న హైదరాబాద్ పరిధిలోని దేవాలయాలకు ఈ నెల 18 వ తేదీన చెక్కుల పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బోనాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహంకాళి ఆలయంకు వెళ్ళే రెండు ప్రధాన రహదారులలో నిర్మించిన ఆర్చీలను 15వ తేదీ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముందుగా మంత్రి తలసాని శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలలో అధికారులతో కలిసి పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించారు. 2 రోజులలో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY