ఈ స్థాయిలో ఐటీ రెయిడ్స్ జరగడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, తన కొడుకును మానసికంగా వేధించి సంతకం పెట్టించారని, అధికారులే ఇలా మోసం చేస్తారని అనుకోలేదని తెలిపారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. గత రెండు రోజులుగా ఆయనతో పాటు సోదరులు, కుమారులు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు చేసిన విషయం తెలిసిందే. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేసినట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. కాగా మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ సోదాల సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు జరగడం విశేషం. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు దొరికిందని కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు ముగిసిన అనంతరం ఆయన తన అల్లుడితో కలిసి మీడియా సమావేశం నిర్వహించి దాడులు జరిగిన తీరుని వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఇవి సాధారణంగా జరిగిన రెయిడ్స్ కాదని, కావాలని కక్షపూరితంగా చేసినవేనని ఆరోపించారు. గతంలో రెండు సార్లు దాడులు జరిగాయని, అయితే ఈ స్థాయిలో ఐటీ రెయిడ్స్ జరగడం, ఇంతమంది అధికారులు పాల్గొనడం తానెప్పుడూ చూడలేదని, అయినాసరే ఎన్ని రెయిడ్స్ జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఐటీ శాఖ తనిఖీలకు తనకెలాంటి అభ్యంతరం లేదని, అయితే మానసికంగా హింసిస్తూ ఇబ్బందులకు గురిచేయడమే ధ్యేయంగా ఇవి జరిగాయని మంత్రి పేర్కొన్నారు. లేదంటే తన ఇంటితో పాటు కుమారులు, బంధువుల ఇండ్లలో రెండు వందల మంది ఐటీ అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. ఇక తన పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి ఛాతినొప్పితో దవాఖానకు వెళ్లారనే విషయాన్ని టీవీలో చూశానని, ఆస్పత్రి వద్దకు వెళితే అధికారులు లోపలకు అనుమతించలేదని మండిపడ్డారు. తన కుమారుడిపై కేంద్ర బలగాలతో దాడి చేశారని, ఆస్పత్రి పాలయ్యేలా చేశారని మల్లారెడ్డి మండిపడ్డారు.
తామేమీ దొంగ దందాలు చేయలేదని, ఎవరినీ దోచుకోలేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. పాలు అమ్మి, బోర్లు వేసి పైకి వచ్చానని, ఇప్పుడు కూడా చట్టప్రకారమే వ్యాపారం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. విద్యాసంస్థలు స్థాపించిన నాటినుంచి తక్కువ ఫీజుతో పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందిస్తున్నామని, అలాగే తమ ఆస్పత్రుల్లో నిరుపేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు. కాలేజీల ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయని, ఇక అక్రమాలకు చోటెక్కడుంటుంది? అని ప్రశ్నించారు. దాడుల విషయం సీఎం కేసీఆర్ ముందే చెప్పారని, త్వరలో మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా దాడులు జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. సీఎం కేసీఆరే మా ధైర్యమని, అంతా ఆయనే చూసుకుంటారని చెప్పారు. తెలంగాణపై బీజేపీ కుట్రలు చేస్తోందని, తాను కేవలం టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రిననే కారణంతో దాడులు చేశారని ఆరోపించారు. మరో మూడు నెలలు తమను వేధిస్తూనే ఉంటారని, ఆయకార్ భవన్ వేదికగా ఈ దాడులకు రూపకల్పన జరుగుతోందని, దీని వెనుక బీజేపీ పెద్దలున్నారని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE