తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు సాయంత్రం కల్లా వెలువడనున్నాయి. అలాగే ఫలితాలకోసం ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో పాటుగా ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2619 కౌంటింగ్ కేంద్రాలలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియ మొదలైంది. పోల్ అయిన ఓట్లను బట్టి 5 నుంచి 24 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ముందుగా అన్నిచోట్లా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు, ఆతర్వాత బ్యాలెట్ పత్రాల ఓట్లను లెక్కిస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా వచ్చిన పరిస్థితుల్లో లాటరీ పద్దతి ద్వారా అభ్యర్థి విజయాన్ని నిర్ణయించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సుమారు 10 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ఫలితాల ద్వారా 2,647 మంది వార్డు సభ్యులు, 324 కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. ఇప్పటికే 80 మంది వార్డు సభ్యులు, ఒక కార్పోరేటర్ ఏకగ్రీవంగా ఎన్నికయినా సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి 27న మేయర్లు, ఛైర్పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ఛైర్పర్సన్ల ఎన్నిక పక్రియ చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో జనవరి 24న పోలింగ్ జరగగా, అక్కడ ఓట్ల లెక్కింపు పక్రియను జనవరి 27న చేపడతారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది. ముందుగా ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ ఆధిపత్యంలో కొనసాగుతుంది. ఇప్పటికే బాన్సువాడ, భీమ్గల్, కొత్తపల్లి, సత్తుపల్లి, వర్థన్నపేట, ధర్మపురి మున్సిపాలిటీల్లో టిఆర్ఎస్ జయకేతనం ఎగరవేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రతిచోట కొన్ని వార్డులు గెలుస్తున్నప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతుంది. బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా అక్కడక్కడా మాత్రమే ప్రభావం చూపగల్గుతున్నాయి. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి ఎన్నికల ఫలితాల సరళిని పర్యవేక్షిస్తున్నారు.
[subscribe]