ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జనవరి 24, శుక్రవారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్ కు పార్టీ నేతలతో కలిసివెళ్లిన చంద్రబాబు గవర్నర్ తో భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా శాసన సభ, శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారణ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన సంఘటనలకు సంబంధించిన వివరాలను గవర్నర్ కు చంద్రబాబు అందజేశారు. రాష్ట్ర మంత్రులు, ఇతర వైసీపీ సభ్యుల తీరుపై ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్రంలో తాజా పరిస్థితులు, రాజధాని అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళలను చంద్రబాబు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
[subscribe]