మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్గోపాల్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వస్తే తప్ప అభివృద్ధి జరిగే పరిస్థితి లేదని, అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. మునుగోడులో మూడేళ్ళుగా అభివృద్ధి లేదని, ప్రతిపక్ష నాయకుల నియోజకవర్గాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన మండిపడ్డారు.
మునుగోడు లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల సమస్య ఉందని, దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొన్ని వందలమంది బలిదానాలతో వచ్చిందని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని కోమటిరెడ్డి విమర్శించారు. స్వయంగా పార్టీలోకి రమ్మని సీఎం కేసీఆర్ కోరినా నేను పార్టీ మారలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీన పడిందని, కొన్ని సందర్భాల్లో అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలు తీసుకుందని, దాని కారణంగా రాష్ట్రంలో మరింతగా బలహీన పడిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. బయట పార్టీల నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేస్తున్నారని, అలంటి వారి కింద ఆత్మాభిమానం చంపుకొని పార్టీలో కొనసాగలేనని అందుకే పార్టీ నుంచి కూడా బయటకు వెళ్తున్నానని వెల్లడించారు. ఒకవైపు రాజ్గోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో తాను ఏ పార్టీలో చేరేదీ ఆయన ఇంకా స్పష్టం చేయకపోవడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY