తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే ప్రారంభోత్సవానికి సంబంధించి త్వరలోనే మరో కొత్త తేదీని ప్రకటిస్తామని కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. ఇక సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాజధాని నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన సకల హంగులతో దీనిని నిర్మించారు. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సెక్రటేరియట్ ను సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభం చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సన్నాహాలు ప్రారంభించింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేకమంది జాతీయస్థాయి నేతలను దీనికోసం ఆహ్వానించింది.
అయితే తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయక తప్పలేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తున్నందున షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 17, 2023న ఈ కార్యక్రమం నిర్వహించడానికి కుదరదని, దీంతో ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. కానీ అంతకుముందు సచివాలయం భవనం ప్రారంభోత్సవానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆశ్రయించారు. అయితే ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చివరికి తెలంగాణ ప్రభుత్వం సచివాలయ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని వాయిదా వేసింది.
కాగా ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీని ప్రకారం ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాల్లో.. తెలంగాణలో ఒక ఉపాధ్యాయ మరియు ఒక స్థానిక సంస్థల స్థానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీన గడువుగా ప్రకటించారు. ఇక నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 24వరకు చేపట్టనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. అనంతరం మార్చి 13న ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, మార్చి 16న ఫలితాల వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు పూర్తి అయ్యాక సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త తేదీని ప్రకటించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE