తెలంగాణకు చెందిన యువ క్రీడాకారిణి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ టైటిల్ గెలుచుకుంది. ఇస్తాంబుల్ (టర్కీ)లో గురువారం జరిగిన మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్ తన ప్రత్యర్థి థాయ్లాండ్ బాక్సర్ జిట్పాంగ్ జుటామస్ను మట్టికరిపించింది. 52 కేజీల విభాగంలో బరిలో నిలిచిన జరీన్ 5-0 తేడాతో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. వరుస పంచ్ లతో చెలరేగడంతో న్యాయనిర్ణేతలు బౌట్లో 30-27, 29-28, 29-28, 30-27, 29-28తో జరీన్ కు స్కోర్ ప్రకటించారు. ఈ విజయంతో జరీన్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఐదవ భారత బాక్సర్గా నిలిచింది.
ఇంతకుముందు భారత దిగ్గజ బాక్సర్లు మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కేసీ తర్వాత ప్రపంచ బాక్సింగ్ టైటిల్ గెలిచిన ఐదో భారత బాక్సర్గా నిఖత్ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. మేరీకోమ్ రికార్డు విజయాలతో ఆరుసార్లు ఛాంపియన్గా నిలవడం విశేషం. ఆమె 2002, 2005, 2006, 2008, 2010 మరియు 2018లలో చాంపియన్షిప్ గెలుచుకుంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి మొత్తం 12 మంది సభ్యులతో కూడిన భారతీయ బృందం ఇస్తాంబుల్ వెళ్లగా, వారిలో నిఖత్ జరీన్ ఒకరు. వీరిలో మనీషా 57 కేజీల విభాగంలో మరియు పర్వీన్ 63 కేజీల విభాగంలో కాంస్య పతకాలు సాధించగా జరీన్ స్వర్ణం సాధించింది. ఈ అద్భుత విజయంతో తెలంగాణ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ