హైదరాబాద్ నగరంలో ఇటీవల భారీ వర్షాల వలన ప్రభావితమైన కుటుంబాలకు అందిస్తున్న 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, అందువలన బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, నగదు పంపిణీ నిలిపివేయాలని పేర్కొంటూ ఎస్ఈసీ సెక్రటరీ ఎం.అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పక్రియ ముగిసిన అనంతరం వరద సాయాన్ని మళ్ళీ కొనసాగించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ముందుగా భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలో వరదనీటి ప్రభావానికి గురైన ప్రతీ ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆ సమయంలోనే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద సాయం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే 6.64 లక్షల కుటుంబాలకు వరదసాయం అందించినట్లు తెలిపారు. అయితే అర్హులైన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే వారిని మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో నగరంలో పలు మీ-సేవా కేంద్రాల వద్ద బాధితుల రద్దీ నెలకుంది. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో వరద సాయం నిలిపివేస్తూ ఎస్ఈసీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ