ఉబ్బసం వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కోసం ఉచితంగా అందించే ‘చేప ప్రసాదం’ పంపిణీకి ముహుర్తం ఖరారైంది. జూన్ 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయనను మంగళవారం బత్తిన కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు చేప పంపిణీ ప్రసాదంపై మంత్రి తలసానితో చర్చించారు. కరోనా మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ నిలిచిపోయిన నేపథ్యంలో.. ఈ ఏడాది నుంచి చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఎప్పటిలాగే ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ చేయాలని నిర్ణయించారు. కాగా ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉబ్బసం వ్యాధి గ్రస్తులు హైదరాబాద్కు వస్తుంటారు. ఈ చేప ప్రసాదం కోసం జనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి గంటల తరబడి వేచి చేస్తారంటే దీని ప్రత్యేకత అర్ధం చేసుకోవచ్చు. అయితే రెండేళ్ల తర్వాత తొలిసారి చేప ప్రసాదం పంపిణీ చేస్తుండటంతో ఈ సారి జనం భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం సహకారంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయడం కోసం మంత్రిని కలిసి కార్యక్రమం గురించి వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE