తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో వానాకాలం, యాసంగిలో వరి కొనుగోలు, పెట్రోల్, డీజీల్ రేట్లు, దళితబంధు, రైతు చట్టాలు, రాష్ట్ర బీజేపీ నాయకుల విమర్శలు, రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై కేంద్రం స్పందనపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. బాయిల్డ్ రైస్ కేజీ కూడా తీసుకునేది లేదని కేంద్రం తేల్చి చెప్పిందని, ఈ నేపథ్యంలోనే యాసంగిలో వరి పంట వద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రకటన చేశారని చెప్పారు. రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేసి, వారి బాగోగుల కోసమే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. యాసంగిలో వరి వేసే విషయంలో రైతులు తొందర పడొద్దని చెప్పారు. వరి సేకరణపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని, కేంద్రం తేల్చిచెబితే వరి వేయడంపై నిర్ణయం తీసుకోవచ్చన్నారు. డిసెంబర్ లో కూడా వరి వేసుకోవచ్చని, తొందర అవసరం లేదని తెలిపారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మి రైతులు నష్టపోవద్దని అన్నారు. యాసంగిలో రైతులు ఏఏ పంటలు వేసుకోవాలో నవంబర్ రెండోవారంలోపు చెప్తామన్నారు.
నన్ను జైలుకు పంపుతావా? కేసీఆర్ ను టచ్ చేసి బతుకుతావా?:
మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆయన స్థాయికి మించి మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. వ్యక్తిగతంగా విమర్శించినా కూడా ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటయిలే అని ఊరుకున్నానని అన్నారు. కానీ రైతుల విషయంలో కూడా అబద్దాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. బండి సంజయ్ ఎలాంటి బాధ్యత లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, రాష్ట్ర ప్రభుత్వంపై, తనపై అర్థపర్థం లేని విమర్శలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బండి సంజయ్ నన్ను జైలుకి పంపుతా అంటున్నాడు, అంత ధైర్యం ఉందా? నన్ను అరెస్ట్ చేస్తారా?, తమాషాగా ఉందా? అంత బలుపా? అంత అహంకారమా? ఎవరు అనుకోని మాట్లాడుతున్నావ్? ఎంతొస్తే అంత మాట్లాడతారా, కేసీఆర్ ను టచ్ చేసి చూడు, కేసీఆర్ని టచ్ చేసి బతుకుతావా? అంటూ సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ బీజేపీ వరి వద్దని చెబుతుంటే, సిల్లీ బీజేపీ వరి వేయాలంటున్నది. సొల్లు పురాణం ఆపి, రైతులకు మేలు చేసే పనిచెయ్యాలని చెప్పారు. ఇకపై వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులకు మద్దతు తెలుపుతామని చెప్పారు. ఢిల్లీ రైతులకు మద్దతుగా మేం ధర్నాలు చేస్తాం. మూడు చట్టాలు విత్ డ్రా చేసుకోవాలి. ఈ విషయంలో కేంద్రాన్ని ఇంకా నిద్ర పోనివ్వమని అన్నారు. మీరు మా మేడలు వంచడం కాదు, ఇకపై మేమే ఇరుస్తమని అన్నారు.
రాష్ట్రంలో పెట్రోల్ పై వ్యాట్ లో పైసా కూడా పెంచలేదు, రేట్ కూడా తగ్గించం:
అలాగే పెట్రోలు విషయంలో కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందన్నారు. ఇటీవల ఉప ఎన్నికల్లో దేశమంతటా బీజేపీకి వచ్చిన ఫలితాల వలనే కంటితుడుపు చర్య కింద కొంత రేట్లు తగ్గించారని అన్నారు. పెట్రోల్ రేట్ కొండంత పెంచి, పిసరంత తగ్గించారు. పెట్రోల్పై సెస్ ను కేంద్రం పూర్తిగా విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో పెట్రోల్ పై వ్యాట్ లో పైసా కూడా పెంచలేదని, ఇప్పుడు మేం రేట్ కూడా తగ్గించమని తెలిపారు. మరోవైపు దళిత బంధు పథకంపై వస్తున్న విమర్శలను సీఎం తిప్పికొట్టారు. చెప్పిన విధంగా దళిత బంధు పథకాన్ని వందకు వంద శాతం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ