తెలంగాణ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపిన ఆయన ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు లేఖ పంపారు. డీఎస్ రాజీనామా లేఖను ఆయన భార్య ధర్మపురి విజయలక్ష్మి సోమవారం మీడియాకు విడుదల చేశారు. లేఖలో డీ శ్రీనివాస్ ఇలా తెలిపారు.. ‘నిన్న నా కుమారుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆశీస్సులు అందజేయడానికి గాంధీ భవన్కు వెళ్లిన నాకు కండువా కప్పి పార్టీలో చేరినట్లుగా ప్రచారం చేయడం జరిగింది. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ, ప్రస్తుతం నా వయస్సు, ఆరోగ్యం కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నన్ను అనవసర వివాదాల్లోకి లాగవద్దు. కాంగ్రెస్ పార్టీలో నేను మళ్ళీ చేరానని భావిస్తే, ఈ లేఖను నా రాజీనామాగా భావించి ఆమోదించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
కాగా నిన్న తన తనయుడు సంజయ్తో పాటు కాంగ్రెస్లో చేరిన డీఎస్.. ఈ రోజు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. ఈ సందర్భంగా డీఎస్కు ఆరోగ్యం సహకరించడం లేదని, కాంగ్రెస్ నేతలు కానీ, మీడియా వారు కానీ, ఎవరూ తమ ఇంటికి రావొద్దని విజయలక్ష్మి కోరారు. కాగా డీఎస్ కుటుంబంలో నెలకొన్న రాజకీయ పరిణామాలే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దాదాపు 8 ఏళ్ల కిందట కాంగ్రెస్ను వీడిన డీఎస్.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) లో చేరారు. అయితే కొద్దిరోజుల అనంతరం ఆ పార్టీకి దూరమయ్యారు. మరోవైపు డీఎస్ ఇద్దరు కుమారులలో.. ఒకరైన ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో కుమారుడు ధర్మపురి సంజయ్ నిన్న కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ వీల్ ఛైర్లో గాంధీ భవన్కు వచ్చిన డీఎస్.. సంజయ్తో పాటు అక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE