వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) పద్ధతిలో భూములను సేకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్-హన్మకొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల ల్యాండ్ పూలింగ్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రైతుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు పోరాటంలో పాలుపంచుకోవడంతో కేసీఆర్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ఉత్తర్వులను రద్దు చేసింది.
ఈ మేరకు సోమవారం రాత్రి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ పేరిట ప్రకటన వెలువడింది. 41 కిలోమీటర్ల ఈ ఔటర్ రింగ్ రోడ్డు కోసం వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 28 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరణకు ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించాలని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గతంలో నోటిఫికేషన్ జారీ చేసి, సర్వే పనులను ప్రారంభించింది. అయితే ల్యాండ్ పూలింగ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మూడు జిల్లాల పరిధిలోని రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ధర్నాలు, రాస్తా రోకోలు, హైవేల దిగ్బంధం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘కుడా’ పరిధిలో ల్యాండ్ పూలింగ్ను నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్కు ఆదేశాలిచ్చారు. దీంతో అర్వింద్ కుమార్ ల్యాండ్ పూలింగ్ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కాగా ఏడాదికి రెండు పంటలు పండే తమ భూములను ఇచ్చేది లేదని, ప్రభుత్వం తీసుకున్న ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోకూడదని రైతులు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF