పటీదార్ కోటా ఉద్యమ నాయకుడు, గుజరాత్ యువనేత హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 2న హార్దిక్ పటేల్ అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో బీజేపీలో చేరాలని హార్దిక్ పటేల్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పటీదార్ కోటా ఉద్యమం అనంతరం 2019లో హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరి, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. మే 19న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఘాటైన లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ దేశం మరియు సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆ లేఖలో ఆరోపించారు.
గుజరాత్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో వాస్తవ సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బంది పడుతున్నారన్నారు. మూడేళ్ల పాటు కాంగ్రెస్ నేతలతో కలిసి తన సమయాన్ని వృథా చేసుకున్నానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ కూడా తనకు ఎలాంటి అర్ధవంతమైన పని ఇవ్వలేదని రాజీనామా అనంతరం హార్దిక్ పటేల్ విమర్శించారు. అలాగే హిందువులు, రాముడుపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న నాయకులపై చర్యలు తీసుకోకపోవడంపై కూడా ఆయన పార్టీ నాయకత్వాన్ని నిందించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా అనంతరం బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. జూన్ 2న గుజరాత్ పార్టీ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో హార్దిక్ పటేల్ బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF