శాంతి భద్రతలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సమాచార సమన్వయానికి, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ప్రభుత్వ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన, దేశంతో పాటు ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఫ్యూజన్ కేంద్రం)’ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రారంభించిన విషయం తెలిసిందే. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సుపరిపాలనారంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ అందించిన బహుమతిగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిలిచింది.
ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా సభ ప్రారంభమవగా, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ స్వాగతోపన్యాసం చేశారు. ఆతర్వాత రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ లు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మనందరికీ గర్వకారణమని అన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో సీసీసీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సీసీసీ అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమాచార సమన్వయానికి మూలస్థంభంగా ఉంటుందన్నారు.
“ప్రకృతి విపత్తులను ప్రమాదాలను నేరాలను గుర్తించడం,వాటిని ఎదుర్కునేందుకు అధికారులకు సమాచారాన్నిఅందించే అత్యున్నత సామర్థ్యం సీసీసీ కలిగి ఉంది. పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఉత్తమమైన పని ఎక్కడ చేసినా ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుంది. మనలో కొందరు 50 శాతమే వర్తమానంలో ఉండి పనిచేస్తుంటారు. దాంతో ఫలితాలు సరిగా రావు, అనుకున్న పని సరిగా జరగదు. అందుకే ఏపనైనా సరే, రసించి పనిచేస్తే అద్భుత ఫలితాలొస్తాయన్నదానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ రావాలని చెప్తూ వచ్చాను. అది నెరవేరింది. దేశానికే ఆదర్శంగా నిలిచే పోలీస్ వ్యవస్థ కోసం, సంస్కారవంతమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం కోసం సీసీసీ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో గుడుంబా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్మూలించడంలో పోలీస్ శాఖ పనితనం గొప్పది. రాబోయే రోజుల్లో పోలీసులు మరింత చురుకుగా పని చేయాలి. మంచిని సాధించడానికి సంకల్పంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయి. చిత్తశుద్ది వాక్శుద్ది సందర్భశుద్ది వుంటే సాధించలేనిదేమీలేదు. గతంలో పనిచేసిన పోలీసు కమిషనర్లు గొప్ప సేవలందించారు.వారిని పిలిచి వారి అనుభవాలను సలహాలు సూచనలు తీసుకోవాలి” అని సీఎం అన్నారు.
“మానవ సమాజం ఉన్నంత వరకు శాంతి భధ్రతల పరిరక్షణ అందుకోసం పోలీస్ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. సమాజానికి సైబర్ నేరాలు, డ్రగ్స్ ప్రమాదకరంగా పరిణమించాయి. వాటిని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదే. మీ అందరి సహకారంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు వెల్లివిరుస్తున్నాయి. న్యూయార్క్ లాగే మన దగ్గర కూడా నేరాలు పూర్తిగా తగ్గాలి. టెక్నాలజీ అప్ డేట్ కావడం కూడా పోలీసుశాఖకు అవసరమే. తెలంగాణ పోలీసు శాఖ కూడా అద్భుత ఫలితాలు సాధించాలి. ప్రజలకు సేవ అందించే సంస్థలాగా మరింత అభివృద్ధి కావాలి. అందరూ సంస్కారవంతమైన పోలీసులుగా తయారు కావాలి. ఏ సమస్య ఎదురైనా సమిష్టి ఆలోచనలతో పోలీసులు పరిష్కరించాలి. ఆర్అండ్బీ శాఖ మంత్రిని, అధికారులకు, నిర్మాణ సంస్థకు, టెక్నాలజీని సమకూర్చిన ఎల్ అండ్ టీ కంపెనీకి నా అభినందనలు. ఈ భవన నిర్మాణం కోసం పనిచేసిన ప్రతి శ్రామికుడికీ, కార్మికుడికీ నమస్కరిస్తున్నా” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ స్టేట్ పోలీస్ “ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్” సమాచారం:
- 2015 నవంబర్ 22న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంకుస్థాపన, భూమిపూజ చేశారు.
- ఈ సెంటర్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసింది.
- 2022 ఆగస్టు 4వ తేదీన సీఎం కేసీఆర్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు.
- ఈ సెంటర్లో మొత్తం 6 లక్షల 42 వేల చదరపు అడుగుల నిర్మాణం జరిపారు.
- 2.16 లక్షల చదరపు అడుగులు, సూపర్ స్ట్రక్చర్ ఏరియా 4.26 లక్షల చదరపు అడుగుల్లో ఉన్నది.
- ఈ సెంటర్ ను మొత్తం ఐదు బ్లాలుగా నిర్మించారు.
- టవర్ ‘ఏ’లో గ్రౌండ్ ఫ్లోర్ తోపాటు 19 అంతస్తులు.
- టవర్ ‘బీ’లో రెండు బేస్మెంట్లు గ్రౌండ్ ఫ్లోర్, 15 అంతస్తులు.
- టవర్ ‘సీ’లో ఆడిటోరియం గ్రౌండ్ ఫ్లోర్, రెండు అంతస్తులు.
- టవర్ ‘డీ’లో గ్రౌండ్ ప్లస్ మొదటి అంతస్తు.
- టవర్ ‘ఈ’లో సీసీసీని 4 నుంచి 7 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. మరో రెండు బేస్మెంట్ లెవలు ఉన్నాయి.
- అన్ని టవర్లలో ‘ఏ’ టవర్ ఎత్తయినది. దీనిలో మొత్తం 20 అంతస్తులు ఉన్నాయి. దీనిలోనే నాల్గో అంతస్తులో డీజీపీ చాంబర్, 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చాంబర్ ఉంటాయి. 7వ అంతస్తులో ప్రముఖుల చాంబర్లు ఉన్నాయి.
- టవర్ ఏ, బీలను 14వ అంతస్తులో కలుపుతూ 400 మెట్రిక్ టన్నుల బరువుతో దేశంలోనే అత్యంత బరువైన స్కైవాక్ వంతెన నిర్మించారు. దీనికి సోలార్ ఫొటోవోల్టిక్ ప్యానల్ తో రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు.
- నైరుతివైపు ఉన్న టవర్ పైన హెలిపాడను ఏర్పాటు చేశారు. వీవీఐపీ మూమెంట్ కోసం హెలికాప్టర్ సేవలను వాడుకోవచ్చు.
- టవర్లలోని కింది ఫ్లోర్లలో ఆడిటోరియం, కేఫ్, మల్టీపర్పస్ హాల్, మీడియా సెంటర్, రిసెప్షన్ లాబీ ఏర్పాటుచేశారు.
- టవర్-ఏలో 550 వర్క్ స్టేషన్లు ఉంటాయి. వెయ్యి మంది సిబ్బంది పనిచేయవచ్చు.
- టవర్-బీలో 580 వర్క్ స్టేషన్లు ఉన్నాయి. 1500 మంది సిబ్బంది పనిచేయవచ్చు. అన్ని ఫ్లోర్లలోనూ కిచెన్ అందుబాటులో ఉంది. ఆడిటోరియంను 590 మంది సీటింగ్ కెపాసిటీతో ఏర్పాటు చేశారు.
- మొత్తంగా 600కు పైగా వాహనాల పార్కింగ్ సౌకర్యం కలదు.
- టవర్-డీ గ్రౌండ్ ఫ్లోర్ లో 125 మంది కూర్చునే సామర్థ్యంతో మీడియా బ్రీఫింగ్ హాల్ ఉంది. నేరుగా అక్కడి నుంచే లైవ్ కవరేజ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.
- కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక డాటా సెంటర్ కోసం బెల్జియం, జర్మనీ నుంచి సర్వర్లు తెప్పించారు. దాదాపు 30 పెటా బైట్ల సామర్థ్యం ఉన్న స్టోరేజీ ఉన్నది. అంటే 10 లక్షల సీసీటీవీ కెమెరాల ఫీడ్ ఇందులో నిక్షిప్తం అవుతుంది.
- ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాల ఫీడ్ చూసే సామర్థ్యంతో భారీ స్క్రీన్ కూడా ఉంది.
- అలాగే, తెలంగాణలోని అన్ని జిల్లాల సీసీటీవీల ఫీడ్, ఇతర సమాచారం కూడా హైదరాబాద్ లోని సీసీసీకి అనుసంధానమవుతుంది.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు, ప్రయోజనాలు:
- బహుముఖ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ సెంటర్ ను ఏర్పాటు చేసింది.
- ప్రభుత్వ రంగంలోని అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకొంటూ విపత్తుల సమయంలో ప్రజలను సకాలంలో కాపాడటం, నష్టాన్ని తగ్గించడం దీని లక్ష్యం.
- నిరంతర పర్యవేక్షణతో రాష్ట్రంలో నేరాలను నియంత్రించడం కోసం పనిచేస్తుంది.
- ఈ సెంటర్ లో పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఆరోగ్యశాఖ, ప్రకృతివిపత్తుల నిర్వహణశాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాల కేంద్రాలు ఏదైనా విపత్తు, ప్రమాదం జరిగినప్పుడు అన్ని శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తారు.
- శాంతి భద్రతల పర్యవేక్షణ, ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ కు ఈ డాటాను వినియోగించుకోవచ్చు.
- రోజువారీ శాంతిభద్రతల నిర్వహణతోపాటు భారీ బహిరంగ సభలు, ఉత్సవాల సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ కూడా సాధ్యమవుతుంది.
- తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, అన్ని అంబులెన్సులు, ఫైర్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, అన్ని ప్రధాన లొకేషన్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన కూడళ్లు, మార్కెట్లు, ఇలా ప్రతి సమాచారాన్ని సీసీసీలోని హైఎండ్ డాటా ఎనాలసిస్ సెంటర్కు అనుసంధానిస్తారు.
- రాష్ట్రంలో ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, సీసీటీవీల్లోని ప్రత్యేక స్టాఫ్ట్ వేర్ ద్వారా కెమెరాయే నేరుగా సీసీసీకి అలర్ట్ పంపుతుంది. అక్కడ పాక్అప్ స్క్రీన్ పై వస్తుంది. దీంతో వెంటనే సిబ్బంది అలర్ట్ అవుతారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY