తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు మరింతగా ప్రభావం చూపుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97 కు చేరుకుంది. కరోనా బాధితుల్లో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా, 14 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్టు ప్రకటించారు. ప్రస్తుతం 77 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతునట్టు తెలిపారు.
రాష్ట్రంలోతాజా పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటన విడుదల చేశారు. “మర్కజ్ నుండి వచ్చిన వారికి వారి బంధువులకు కలిపి 15 మందికి మంగళవారం నాడు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతానికి 77 మంది యాక్టీవ్ పాజిటివ్ కేసులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మర్కజ్ నుండి వచ్చిన వారందరు గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవలసిందిగా కోరుతున్నాం. కరోనా లక్షణాలు ఉన్నవారు వారి బంధువులను కూడా పరీక్షలు కోసం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తలసీమియా, డయాలిసిస్, సికెల్ సెల్ జబ్బులున్న వారికీ రక్త మార్పిడి అవసరం అవుతుంది కాబట్టి వీరు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వీరిని అడ్డుకోవద్దని పోలీసులకు తెలియచేస్తున్నాం. గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది లేకుండా మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లు పనిచేస్తాయి. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలు ఇంట్లోనే ఉండి సహకరించాల్సిగా కోరుతున్నామని” ఈటల రాజేందర్ పేర్కొన్నారు.