దేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ క్రమంగా విజృంభిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీతో ప్రారంభం కానున్న 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ.4.88 లక్షల కోట్లను అప్పుగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కరోనా వైరస్ వలన ఆర్ధిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం ఈ మొత్తం డబ్బును ఉపయోగించనున్నట్టు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అతాను చక్రవర్తి తెలిపారు.
మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్లో స్థూల రుణాలు రూ.7.8 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. 2019 -20 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన రూ.7.1 లక్షల కోట్ల కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. స్థూల రుణాల్లో పాత అప్పుల చెల్లింపులు సైతం ఉంటాయని పేర్కొన్నారు. ఇక 2019-20 సంవత్సరానికి నికర రుణాలు రూ .4.99 లక్షల కోట్లు కాగా, 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ సమర్పించిన బడ్జెట్లో నికర రుణాలు రూ.5.36 లక్షల కోట్లు ఉంటాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.