దేశంలో నేరాలకు సంబంధించి ఎన్సీఆర్బీ అంటే జాతీయ నేరాల నమోదు సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరాల్లో నకిలీ వార్తలు వ్యాప్తి చేయడంలో, ఆర్ధిక నేరాల్లో కూడా దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని నివేదిక తెలిపింది. దేశంలో నమోదయిన అన్ని నేరాలకు సంబంధించిన నివేదికను జాతీయ నేరాల నమోదు సంస్థ విడుదల చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దేశంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయం ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడైంది. అయితే ఇందులో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఎక్కువమంది బాధితులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. దీనికోసం సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నా జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది..నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని అకౌంట్లు ఖాళీ చేసుకుంటూనే ఉన్నారు.
అయితే మహిళలపై నేరాల విషయంలో మాత్రం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కాస్త మెరుగ్గానే ఉన్నట్లు తేలింది. అలాగే హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలలో మిగిలిన రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలో పరిస్థితి బెటర్గానే ఉంది. కానీ నకిలీ వార్తల వ్యాప్తిలో మాత్రం దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
15,297 సైబర్ నేరాల కేసులు నమోదుతో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ ఉన్నట్లు తేలింది. అలాగే ఆర్థిక మోసాలకు సంబంధించి బ్యాంకింగ్లో 3,223 నేరాలు నమోదు కాగా..అందులోనూ తెలంగాణ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. అంతేకాకుండా ఓటపీ మోసాలకు సంబంధించి 2వేల179, చీటింగ్లో 4వేల467 కేసులు నమోదవడంతో అక్కడ కూడా తెలంగాణనే తొలి స్థానంలో ఉన్నట్లు తేలింది.
మరోవైపు ఏటీఎం మోసాల్లో 624 కేసులు నమోదుతో తెలంగాణ రెండోస్థానంలో ఉన్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. అలాగే బెదిరించి వసూళ్లుకి పాల్పడిన కేసులకు సంబంధించి 447 కేసులతో రాష్ట్రం మూడోస్థానంలో ఉండగా..లైంగిక వేధింపులకు సంబంధించి 152 కేసులు నమోదై దేశంలోనే తెలంగాణ 7వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇక దొంగతనాలకు సంబంధించి 15,854, 6వేల 650 వెహికల్స్ చోరీల కేసులతో 8వ స్థానంలో ఉంది. అక్రమ నిర్భంధం 1,372, అపహరణలు 2,981, పిల్లల అపహరణలు 700కేసులు దోపిడీలకి సంబంధించి 520, నమ్మకద్రోహంపై 595 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ వేధింపులు 1,787, మనుషుల అక్రమ రవాణా 233, ఆహారకల్తీ 1635, నకిలీ వార్తల వ్యాప్తిపై 264 కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక తేల్చింది.
అంతేకాదు మిస్సింగ్ కేసులు 22,701, మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద 1,279 కేసులు, ఆత్మహత్యకు ప్రేరేపించడంపై 375 కేసులు, 137 వరకట్న మరణాల కేసులు, 470 లైంగిక దాడి కేసులు, 814 అత్యాచారం కేసులు, 2,752 పోక్సో కేసులు కూడా తెలంగాణలో నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక తేల్చింది.మొత్తంగా పోలీస్ యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా నేరాలను పూర్తి స్థాయిలో అదుపు చేయలేకపోతున్నారు. అందుకే ఇలాంటి కేసులపై ప్రజల అవేర్నేస్ కలిగి ఉండటం కూడా అవసరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY