తెలంగాణ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సోమవారం ఉదయం 11 గంటలకు ఆయనతో ప్రమాణం చేయించారు. పార్లమెంట్లోని రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమానికి.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధు తదితరులు హాజరయ్యారు. మరోవైపు రవిచంద్రకు మద్దతు తెలుపుతూ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పలువురు పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు, వద్దిరాజు రవిచంద్రకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు పేర్లను పరిశీలించినప్పటికీ.. సీఎం కేసీఆర్ తుదకు వద్దిరాజు వైపే మొగ్గుచూపారు. ప్రముఖ వ్యాపారవేత్త కావడం, అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండటం ఆయనకు కలిసి వచ్చింది. దీంతో రవిచంద్రకు రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం దక్కింది. అలాగే ప్రతిపక్షాల నుంచి కూడా ఎలాంటి పోటీ లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో.. వద్దిరాజు ఆదివారం సాయంత్రానికే ఢిల్లీ చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాజధానికి పయనమైన ఆయనకు ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఆతిథ్యమిచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక రవిచంద్ర సీఎం సీఎం కేసీఆర్ ను కలవనున్నారని సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ