ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ట్యాంక్ బండ్ పై చేపట్టిన సకలజనుల సామూహిక దీక్ష ఉద్రిక్తంగా మారింది. ట్యాంక్బండ్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ఆర్టీసీ కార్మికులును అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా కార్మికులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరగగా, కొంతమంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు చలో ట్యాంక్బండ్కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి, ట్యాంక్ బండ్ పై బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ కార్మికులు ఒక్కసారిగా భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, ఓయూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని పోలీసుల ఏర్పాటు చేసిన బారికేడ్లు మరియు ఇనుప ముళ్ల కంచెలును దాటుకుని ముందుకు దూసుకెళ్లారు. ట్యాంక్ బ్యాండ్ వైపుకు దూసుకొస్తున్న కార్మికులను పోలీసులు తాళ్లతో నెడుతూ లిబర్టీ వైపుకు పంపిస్తున్నారు. మధ్యలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో, పరిస్థితులని అదుపుచేయడానికి ర్యాపిడ్ యాక్షన్ బలగాలు భాష్పవాయు వాహనాలతో ట్యాంక్బండ్ వద్దకు చేరుకున్నారు. మరో వైపు ఆర్టీసీ క్రాస్రోడ్డు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అరుణోదయ సమాఖ్య నాయకురాలు విమలక్క ఇతర నాయకులు ట్యాంక్ బండ్ వైపు ర్యాలీగా రావడంతో కొద్దిసేపు ఇందిరాపార్కు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఎక్కడికక్కడే నాయకులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటున్నారు.
[subscribe]