వాళ్లూ పొమ్మన్నారు.. వీళ్లూ పట్టించుకోలేదు.. మొత్తానికి కమ్యూనిస్టులను ఎవరూ దగ్గరకు చేర్చుకోలేదు. దీంతో వారికి కోపమొచ్చింది. నామినేషన్ల సమయం ముంచుకొస్తున్నా లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటూ తేల్చకపోవడంతో సీపీఐ అగ్రనేత నారాయణ తనదైన స్టైల్లో ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తనదైన శైలిలో స్పందించారు.. ‘నిచ్చితార్ధం అయ్యాక ఇంకో అందమైన అమ్మాయి గాని.. అబ్బాయిగాని దొరికితే లాగేసుకుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగవచ్చేమో గానీ, వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాల్లో కూడా అలాగే జరిగితే ఎలా?’ అంటూ సీపీఐ అగ్రనేత నారాయణ సెటైరికల్గా ట్వీట్ చేశారు. వామపక్షాలకు ఇస్తామన్న సీట్లను కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరుతున్న నాయకులకు కేటాయించనున్నారని జరుగుతున్న ప్రచారంతో నారాయణ ఇలా తన అసహనాన్ని, ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
‘‘ఇస్తామన్న సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. భద్రాచలంలో వరుసగా గెలిచాం. పాలేరు, భద్రాచలం సీటు కావాలని మేం పట్టుపట్టాం. కానీ కాంగ్రెస్ ఇవ్వలేదు. మేము అడిగిన సీట్లు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చే సీట్లకు మేము ఒకే అన్నాం. కాంగ్రెస్తో పొత్తుల అంశంలో చాలా మెట్లు మేము దిగాం. వైరా ఇస్తామని.. .మళ్ళీ మాట మార్చి ఇస్తామని అనలేదు అంటూ భట్టి విక్రమార్క అబద్ధం అడారు. అవమానకరంగా పొత్తులకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు.’ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు.
పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని సంకేతాలందుతుండటంతో కమ్యూనిస్టు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ.. కమ్యూనిస్టు పార్టీల సహాయంతో విజయం సాధించింది. అదే పొత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ఆశలు పెట్టుకున్నాయి. కానీ వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. కనీసం వాళ్లతో సంప్రదించకుండానే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేశారు. దీంతో గులాబీ పార్టీపై లెఫ్ట్ పార్టీలు గరం గరం అయ్యాయి. కాంగ్రెస్ కూడా ఇప్పుడే అదే పంథా అవలంభిస్తోంది.
ఇప్పటి దాకా కాంగ్రెస్తో దోస్తీ కొలిక్కిరాలేదు. అయితే.. దోస్తీ లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఊరించి.. ఊరించి.. చివరికి ఉసురుమనిపించారు. వామపక్షాలు కోరిన సీట్లు ఇచ్చేందుకు హస్తం పార్టీ మొగ్గుచూపించినట్లు కనిపించలేదు. దీంతో ఒంటరిగానే బరిలో దిగాలని కమ్యూనిస్టులు నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే సీపీఎం కాంగ్రెస్కు వీడ్కోలు చెప్పింది. కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక సీపీఐ కూడా అదే బాటలో ఉన్నట్లు సమాచారం. రేపు సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశం అవుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్తో వెళ్లేదో.. లేదో స్పష్టమైన ప్రకటన చేయనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE