మొన్నటి వరకూ జగిత్యాలలో అసెంబ్లీ ఎన్నికల కోసం హోరాహోరీ పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అనేలా పరిస్థితులు కనిపించాయి. కానీ ఇప్పుడు బీజేపీ వేగంగా పుంజుకోవడంతో.. ప్రస్తుతం పొలిటికల్ సీన్ మారి త్రిముఖ పోరుగా మారిపోయింది.జగిత్యాలలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుత పరిస్థితులను రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సంజయ్ కుమార్ బరిలో దిగగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి భోగ శ్రావణి బరిలోకి దిగారు. అయితే..ముందుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని భావించారు. కానీ భోగ శ్రావణి.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరడంతో అక్కడి రాజకీయాలు మారిపోయి తాజా రాజకీయ పోరు రసవత్తరంగా మారిపోయింది.
జగిత్యాల మునిసిపల్ చైర్ పర్సన్ సంజయ్ కుమార్తో విభేదాలతో.. భోగ శ్రావణి.. తన పదవికి రిజైన్ చేసి కాషాయ కండువా కప్పుకున్నారు.ఇక బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన సంజయ్ కుమార్కు సౌమ్యుడిగా పేరుండటంతో పాటు..రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి బాగానే దూసుకు వెళ్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీ కవిత.. ఈ నియోజకవర్గంలో సంజయ్ కుమార్కు మద్దతుగా క్యాంపెయిన్ కూడా నిర్వహించారు.
2018లో జరిగిన ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో.. సంజయ్ కుమార్ విజయం సాధించారు. తాజాగా మరోసారి జీవన్ రెడ్డితో తలపడుతున్నారు. రెండు నెలల ముందు నుంచే ప్రచారం చేస్తూ జీవన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే, జీవన్ రెడ్డి.. ఇవే తనకు చివరి ఎన్నికలని చెబుతూ సెంటిమెంట్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే.. జగిత్యాలలో పర్యటించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని అంతా భావించారు.
కానీ భోగ శ్రావణి రాకతో జగిత్యాలలో పొలిటికల్ సీన్ మారిపోయింది. ద్విముఖ పోటీ కాస్తా త్రిముఖ పోరుగా అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి భోగ శ్రావణి ఇక్కడ బీసీ నినాదంతోపాటు.. మహిళా అభ్యర్థిగా ఆదరించాలని కోరుతూ ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నారు.
ముఖ్యంగా బీసీ ఓట్లపై ఫోకస్ పెట్టిన ఆమె..ఇప్పటికే రెండు విడతల్లో ఆ నియోజకవర్గంలో పర్యటించారు. ఇలా త్రిముఖ పోరులో ఈ ముగ్గురు అభ్యర్థులు..తమదే గెలుపు అంటూ ధీమాతో పోటా పోటీగా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. హఠాత్తుగా మారిన రాజకీయ పరిణామాలతో ఈ త్రిముఖ పోరులో గెలుపును రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE