తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఓరుగల్లుకు చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేక స్థానమే ఉంటుంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలలో వరంగల్లో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కూడా.. ఓరుగల్లు వాసులు గులాబీ పార్టీ పక్షాన నిలిచారు. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు గట్టిగా పోటీ ఇవ్వలేకపోవడంతో అరకొర సీట్లు దక్కాయి. కానీ ఈసారి దీనికి పూర్తి వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థులంతా సిట్టింగ్లే. అయితే ఇప్పటికే వారిపై కొంత వ్యతిరేకత ఉండడం…దీనికి తోడు కాంగ్రెస్ అధిష్టానం టికెట్లు కేటాయించిన అభ్యర్థులపై స్థానికంగా సానుకూలత ఉండటంతో ఈ పోరు రసవత్తరంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆరుచోట్ల బరిలో ఉండగా అక్కడ ముఖాముఖి పోరు కొనసాగుతుండగా..మరో ఆరు చోట్ల మాత్రం త్రిముఖ పోటీ నెలకొంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు సెగ్మెంట్లలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. స్టేషన్ ఘనపూర్,పాలకుర్తి, జనగామ, ములుగు, డోర్నకల్ , నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ లలో నువ్వా? నేనా అన్నంతగా పోరు నడుస్తుంది. పాలకుర్తి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉండగా… కాంగ్రెస్ అభ్యర్థిగా మామిడాల యశస్విని రెడ్డి, బీజేపీ నుంచి లేగా రామ్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన యశస్విని రెడ్డి…40 ఏళ్ల అనుభవం ఉన్న మంత్రి ఎర్రబెల్లికి చెమటలు పట్టిస్తున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. .ఆరు సార్లు ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన మంత్రి ఎర్రబెల్లికి.. యశస్విని రూపంలో గట్టి పోటీ ఎదురవుతుండటం రాజకీయ విశ్లేషకులను కూడా విస్మయపరుస్తుంది.
జనగామలో బీర్ఎస్ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి ఆరుట్ల దశమంత్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. ఇక్కడ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కాదని పల్లాకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఇక్కడ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
స్టేషన్ ఘనపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బరిలో దిగగా…కాంగ్రెస్ అభ్యర్థిగా సింగపురం ఇందిర, బీజేపీ నుంచి మాజీమంత్రి విజయరామారావు పోటీకి దిగుతున్నారు. ఇక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను మార్చిన బీఆర్ఎస్ అధిష్టానం.. కడియంకు టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర మరోసారి తన లక్ను పరీక్షించుకోవడానికి బరిలో దిగారు.
ఇక ఏజెన్సీ ప్రాంతమైన ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంచార్జి జెడ్పీ ఛైర్పర్సన్ బడే నాగజ్యోతి బరిలో దిగగా..కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క, బీజేపీ నుంచి మాజీమంత్రి చందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ పోటీకి దిగారు. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్ ఆశించి బయటకు వెళ్లిపోయిన ప్రహ్లాద్ కాషాయ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచిన సీతక్కకు… నాగజ్యోతి గట్టిగానే పోటీ ఇస్తున్నారు. ఇద్దరికి కూడా నక్సల్స్ నేపథ్యం ఉండడంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది.
నర్సంపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగగా… కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, బీజేపీ నుంచి కంభంపాటి పుల్లారావు పోటీకి దిగారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా? నేనా అన్నట్లు పోరు సాగుతోంది.
డోర్నకల్ అసెంబ్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా రామచంద్ర నాయక్, బీజేపీ నుంచి భూక్య సంగీత పోటీ చేస్తున్నారు. వరుసగా గెలుస్తూ వస్తున్న రెడ్యాతో 2018 ఎన్నికల్లో ఓడిపోయిన రామచంద్ర నాయక్ మరోసారి తలపడుతున్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ సంగీత.. బీజేపీలో చేరడంతో ఆమెకు టికెట్ దక్కింది. అయినా కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఇక్కడ గట్టి పోటీ ఉంది.
అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగిలిన ఆరు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బరిలో ఉండగా… కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ,బీజేపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముగ్గురి మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంది.
ఇక వరంగల్ పశ్చిమ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మరోసారి బీఆర్ఎస్ నుంచి పోటీలో నిలవగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రావు పద్మారెడ్డి బరిలోకి దిగారు. ఇక్కడ కూడా ఈ మూడు పార్టీల మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది.
వర్ధన్నపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మరోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా రిటైర్డ్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పోటీ చేస్తున్నారు. రెండుసార్లు భారీ మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్,బీజేపీ నుంచి సవాల్ ఎదుర్కొంటోంది.
అలాగే పరకాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పోటీకి దిగగా.. కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్ కాళీప్రసాదరావు బరిలో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు ఎదురులేదని ముందు నుంచీ ఉన్న అంచనాలు కాంగ్రెస్,బీజేపీల నుంచి అన్యూహ్యంగా కొత్త అభ్యర్థులు రావడంతో అంచనాలు తారుమారయి ..ముగ్గురి మధ్య హోరాహోరీ పోటీ సాగుతుంది.
భూపాలపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగగా..కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు, బీజేపీ నుంచి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి పోటీ పడుతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి.. బీఆర్ఎస్లో చేరి తొలిసారి కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు. అయితే మూడుసార్లు కూడా ఓటమి చవిచూసిన గండ్ర సత్యనారాయణరావు నుంచి, బీజేపీ అభ్యర్థి కీర్తి రెడ్డి నుంచి ఈసారి బీఆర్ఎస్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది.
ఇక మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి బీఆర్ఎస్ నుంచి బరిలో దిగగా..కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ మురళీ నాయక్, బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్ పోటీకి దిగారు. రెండుసార్లు గెలిచిన శంకర్ నాయక్తో కాంగ్రెస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటోంది. ఈ ముగ్గురి మధ్య పోరు కూడా రసవత్తరంగా సాగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE