కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికలలో జరగనున్న ఐదు రాష్ట్రాలలో అభ్యర్థుల జాబితాలను వరుసగా ప్రకటిస్తోంది. మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో సత్తా చాటాలని తపిస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఫైట్ షురూ చేసింది. ఆ జాబితాల్లో కొన్ని అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అక్కడ మెజార్టీ సీరియర్లే
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తో బుధ్నీ నియోజకవర్గంలో పోటీకి ప్రముఖ నటుడు విక్రమ్ మాస్తాల్ను నిలిపింది. మాస్తాల్ 2008 నాటి రామాయణం టీవీ సీరియల్లో హనుమంతుడి పాత్ర పోషించి గుర్తింపు పొందారు. ఆయన జూలైలో కాంగ్రెస్లో చేరారు. ఈ జాబితాలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం కమల్నాథ్ (ఛింద్వాడా), మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తనయుడు జయవర్ధన్ సింగ్ (రాఘోగఢ్), తమ్ముడు లక్ష్మణ్ సింగ్ (చాచౌడా)తో పాటు పలువురు సీనియర్ల పేర్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ తొలి జాబితాలో 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 65 మంది 50 ఏళ్లలోపు వారని కాంగ్రెస్ ప్రతినిధి చరణ్ సింగ్ సప్రా తెలిపారు. 69 సిటింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చింది. తొలి జాబితాలో అధికార బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన నలుగురు నాయకులకు కూడా టికెట్లు దక్కాయి. ఓబీసీలకు 39, ఎస్సీలకు 22, ఎస్టీలకు 30, మైనారిటీలకు 6, మహిళలకు 19 టికెట్లు ఇచ్చామని సప్రా వివరించారు.
ఛత్తీస్గఢ్లో..
ఇక ఛత్తీస్గఢ్లో 30 మందితో తొలి జాబితా ప్రకటించింది. సీఎం భూపేష్ బాఘెల్ ఎప్పటిలా తన పాటన్ నియోజకవర్గం నుంచి, ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ అంబికాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో మొత్తం 12 మంది మంత్రులు సహా 22 మంది సిటింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 స్థానాల్లో సిటింగ్లకు టికెట్ దక్కలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎంపీ దీపక్ బాజీని అధిష్ఠానం అసెంబ్లీ బరిలోకి దింపింది. ఈ 30 నియోజకవర్గాల్లో 14 ఎస్టీ, 3 ఎస్సీ రిజర్వుడు స్థానాలు. మిగతా 13 జనరల్ స్థానాల్లో తొమ్మిదింటిని ఓబీసీలకు కేటాయించింది. తొలి జాబితాలో నలుగురు మహిళలకు చోటు దక్కింది. వీరిలో ఓ మంత్రి, ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
తెలంగాణలో..
తెలంగాణలో 119 స్థానాలకు గాను 55 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో.. మిగిలిన సీట్లలో అభ్యర్థులను దసరా తర్వాతనే ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీలకు, వామపక్షాలకు కేటాయించే సీట్ల లెక్క తేలిన తర్వాత స్ర్కీనింగ్ కమిటీ మరోమారు సమావేశమై తుది కసరత్తు జరిపి, మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తుందని, ఆ జాబితాను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ నెల 24న కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుందని, అందులో అభ్యర్థుల తుది జాబితా పరిశీలన, ఆమోదం.. మరుసటి రోజున ప్రకటన ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే ఆదివారం ప్రకటించిన తొలిజాబితా 55 సీట్లలో 17 సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి, 7 వెలమలకు కేటాయించారు. బీసీలకు గరిష్ఠంగా 28 సీట్లు కేటాయించాలని అధిష్ఠానం నిర్ణయించగా.. అందులో 12 సీట్లు తొలి జాబితాలోనే ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE