మొత్తం దేశమే మనవైపు చూసేలా పాలించిన నాయకుడు వైఎస్సార్ అని పేర్కొన్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన పలుచోట్ల జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శుక్రవారం టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ 73వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా తొలుత గాంధీభవన్ లో, ఆ తర్వాత నగరంలోని పంజాగుట్ట సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని వైఎస్సార్ చెప్పేవారని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడే వైఎస్సార్ ఆత్మకు శాంతి అని పేర్కొన్నారు. దీనికోసం మనమందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణతో పాటు కేంద్రంలో కూడా అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే వైఎస్సార్ గౌరవార్ధం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్లో ‘వైస్సార్ స్మృతి వనం’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. వైస్సార్ ఆశయాలు, లక్ష్యాలు కొనసాగించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటను నెరవేర్చే నాయకుడిగా ఆయనకు ప్రజలలో పేరుందని, అందుకే వైఎస్సార్ మరణించి ఇన్నేళ్ళవుతున్నా ఆయనను తెలుగు ప్రజలు మరిచిపోలేదని రేవంత్ తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధి అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ వన్గా నిలబెట్టారని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఆదర్శంగా నిలిచాయని రేవంత్ వెల్లడించారు. ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంటు, పేద పిల్లలకు ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, జలయజ్ఞం.. ఇలా ఏ పథకం పేరు చెప్పినా మన మదిలో మెదిలే పేరు వైస్సార్ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజ్, మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ, మాజీ మంత్రులు పొన్నాల, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ