ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత శనివారం ఉదయం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్సీ కవితను మార్చి 9, గురువారం నాడే విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నానని, ఈ దీక్ష అనంతరం మార్చి 11న విచారణకు హాజరవుతానని ఎమ్మెల్సీ కవిత ఈడీకి తెలిపారు. కవిత విన్నపంపై ఈడీ స్పందించి, ఓకే చెప్పింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టిన ఆమె శనివారం ఈడీ విచారణకు హాజరయ్యారు.
శనివారం ఉదయం తుగ్లక్ రోడ్డులోని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. కవిత విచారణ నేపథ్యంలో సీఎం నివాసం వెలుపల పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడి ఆమెకు మద్దతు తెలిపారు. అలాగే అబ్దుల్ కలాం రోడ్ లోని ఈడీ హెడ్ ఆఫీస్ పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు, పలువురు రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. కవిత ఈడీ విచారణపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది.
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి గతంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం 2022, డిసెంబర్ 11న బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని ఆమె నివాసంలో సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వష్ట నేతృత్వంలోని అధికారుల బృందం కవిత నుంచి ఈ కేసుకు సంబంధించి వివరణ తీసుకుంది. ఆ సందర్భంగా దాదాపు ఏడు గంటల పాటు సీబీఐ బృందం పలు అంశాలపై కవితను ప్రశ్నించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు ఈడీ కూడా నోటీసులు పంపింది. ముందుగా మార్చి 6న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులోహైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అరెస్టు చేసింది. ఆయనపై వేసిన రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ఈడీ అధికారులు ప్రస్తావించారు. ఈ క్రమంలోనే అరుణ్ రామచంద్ర పిళ్లై కలిపి ఎమ్మెల్సీ కవితను విచారించే దిశగా ఈడీ ఆమెకు నోటీసులు పంపినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE