జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఈ ఉదయం నారా ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఉండగా కాల్పులకు గురై మరణించారు. ఆదివారం ఎగువ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నగరమైన నారాలో ఒక వేదికపై ప్రసంగిస్తున్న అబేపై వెనుకనుంచి ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. ఛాతీలో బుల్లెట్లు దిగగా అబే ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. దీంతో అప్రమత్తమైన భద్రతాధికారులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి చేరుకున్న ఆయన అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఇక కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న 41 ఏళ్ల టెట్సుయా యమగామి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా షింజో అబే దారుణ హత్యపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది తనను ఎంతగానో కలిచివేసిందని, అబే మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అబేతో తనకున్న అనుబంధాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో అబేతో సమావేశమైన ఫోటోలను పంచుకున్నారు. మంచి మిత్రుడుని కోల్పోయానని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ తెలిపారు. కాగా భారత్తో ప్రత్యేక అనుబంధం ఉన్న షింజో అబేకు 2021లో మోదీ ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించడం గమనార్హం. మరోవైపు మాజీ ప్రధానిపై కాల్పులను జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. ఇది జపాన్ ప్రజాస్వామ్య పునాదిపై ఆమోదయోగ్యం కాని దాడిగా ఆయన పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ