హైదరాబాద్ గాంధీభవన్లో శనివారం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాహుల్ గాంధీ తెలంగాణలో మే 6,7 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే మే 6న రాహుల్ గాంధీ పాల్గొననున్న బహిరంగ సభను భారీ స్థాయిలో నిర్వహించటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వరంగల్ లోని ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని దీనికోసం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మే 7న రాహుల్ గాంధీ హైదరాబాద్లో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు.. స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు రాహుల్ పర్యటన ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. వరంగల్ పట్టణంలో తొలుత ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. మే 6న మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాహుల్ గాంధీ వరంగల్కు హెలికాఫ్టర్లో చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ వరకు నిర్వహించే ర్యాలీలో ఓపెన్ టాప్ వ్యానులో రాహుల్ ప్రయాణిస్తారు. సాయంత్రం 6 గంటలకు జరుగనున్న ‘రైతు సంఘర్షణ సభ’లో రాహుల్ ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ