తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ‘హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర’కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ములుగు జిల్లా మేడారం నుంచి తన పాదయాత్రను ఆరంభించనున్నారు. ఈ క్రమంలో ముందుగా రేవంత్ రెడ్డి సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. అందులో.. ‘నా ప్రజాప్రస్థానంలో “యాత్ర” కీలక ఘట్టం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను. ప్రజల ఆశీర్వాదంతో నాయకుడుగా ఎదిగాను. ప్రశ్నించే గొంతుకగా వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. నన్ను నాయకుడ్ని చేసిన ప్రజల కోసం.. వారి జీవితాల్లో మార్పు కోసం.. యాత్రగా వస్తున్నా’ అని పేర్కొన్నారు. అలాగే ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
ఇక ఈ సందర్భంగా సోమవారం ఉదయం రేవంత్ రెడ్డి తొలుత మేడారంలోని గట్టమ్మ, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత.. మేడారంలో సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుని, పలువురు ప్రజాసంఘాల నేతలతో భేటీ అయి కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం అమ్మవార్ల గద్దెల దగ్గర్నుంచే మధ్యాహ్నం 12గంటలకు తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇక తొలి విడతలో రేవంత్ రెడ్డి 60 రోజుల పాటు 50 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా యాత్ర సాగేలా రేవంత్ రెడ్డి రూట్ మ్యూప్ను సిద్దం చేసుకున్నారు. తొలిరోజు యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి సుమారు 15-20 కిలోమీటర్లు దూరం నడవనున్నారు. ఈ క్రమంలో నేటి యాత్ర మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్ వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం ప్రాజెక్ట్ నగర్లో భోజన విరామం తర్వాత తిరిగి 2.30 గంటలకు ప్రారంభమవనున్న పాదయాత్ర, సాయంత్రం 5 గంటలకు పస్రా గ్రామం చేరుకుంటుంది. అక్కడ టీ విరామం తర్వాత పస్రా కూడలిలో కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకొని భోజనానంతరం రేవంత్ రెడ్డి అక్కడే బస చేస్తారు.
కాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్రావ్ ఠాక్రే దీనిపై స్పందిస్తూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రలను చేపట్టామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ ముఖ్య నేతలు సోమవారం ‘హాత్ సే హాత్ జోడో’ పాదయాత్రలను నిర్వహించనున్నారని ఆయన వెల్లడించారు. ఈ పాదయాత్రల ద్వారా కేంద్రంలోని బీజేపీ మరియు రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చార్జ్షీట్ల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తామని ఠాక్రే స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేశారని, అదే రీతిలో రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర’ ద్వారా రాష్ట్ర ప్రజలను చైతన్యపరుస్తారని మాణిక్రావ్ ఠాక్రే తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE