కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ సభతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకో యేడాదికి పైగా సమయం ఉండగా.. అప్పటివరకు ఈ ఊపును కొనసాగించేందుకు పీసీసీ మరికొన్ని కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర 100 కి.మీ. మేర ఉండేలా ఒక ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో దీనిపై ఒక తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు.
సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 2 నుంచి రాహుల్ పాదయాత్ర వుంటుందని, రాహుల్ గాంధీని రాష్ట్రంలో 100 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని కోరతామని వెల్లడించారు. వరంగల్ డిక్లరేషన్కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని, ఈ డిక్లరేషన్ను ప్రజలలోకి బలంగా తీసుకెళ్తామని తెలిపారు. ఏఐసిసి నిర్వహించిన చింతన్ శిబిర్లో కూడా వరంగల్ డిక్లరేషన్ గురించి మాట్లాడుకున్నారని, చింతన్ శిబిర్ నిర్ణయాలు ఆమోదిస్తూ తీర్మానానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్దంతి సందర్భంగా మే 21 నుంచి ఒక నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టనున్నామని, పార్టీలోని కీలక నాయకులు 21వ తేదీన ఒక్కొక్క చరిత్రాత్మక గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాలో జయశంకర్ సొంత గ్రామంలో రచ్చబండ సభలో తాను స్వయంగా పాల్గొంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ