తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం మే 4, సోమవారం నాడు రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో భేటీ అయింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, రైతుల సమస్యలు, పలు ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదనే అంశంపై గవర్నర్తో చర్చించినట్లు తెలిపారు. చిన్న చిన్న రాష్ట్రాలలో ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తుంటే, టెస్టింగ్ సామర్థ్యం కలిగిఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ స్థాయిలో పరీక్షలు ఎందుకు చేయడం లేదని విమర్శించారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఎన్ని పరీక్షలు చేస్తున్నారు, అలాగే ఐసీఎంఆర్ అనుమతించిన ఆస్పత్రుల్లో పరీక్షలు ఎందుకు చేయడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కరోనా వలన మరణించిన వారి వివరాలను కూడా సరిగ్గా చూపించకుండా, గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు ఎందుకిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనాతో మరణించిన వారికీ ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని, అదే విధంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి బీపీఎల్ కుటుంబానికి రూ.5 వేల ఆర్ధిక సాయం అందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]