కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికకు నేడు (అక్టోబర్ 1, శుక్రవారం) నోటిఫికేషన్ జారీ కాగా, నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ అక్టోబర్ 8 గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలిరోజే నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఈ రోజు ఉదయం గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఇల్లంతకుంట మండల రామాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హుజురాబాద్ చేరుకుని ఆర్డీఓ కార్యాలయంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. గెల్లు శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జెడ్పీ చైర్మన్ విజయ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ లో ఉపఎన్నిక జరుగుతుంది. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఈ ఉపఎన్నికకు అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు గడువును అక్టోబర్ 13గా నిర్ణయించారు. అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించి, నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ