తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 12 స్థానాలకు గాను 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 6 స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. మెదక్ స్థానంలో జరిగిన ఎన్నికల్లో ఒంటేరు యాదవరెడ్డి గెలుపొందారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ఒంటేరు యాదవ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ యాదవ రెడ్డి చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు, పలువురు పార్టీ ఎమ్మెల్సీలు, నాయకులు హాజరై యాదవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు గురువారం నాడు రంగారెడ్డి స్థానం నుంచి ఎన్నికైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మహబూబ్నగర్ నుంచి ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి, కరీంనగర్ నుంచి ఎన్నికైన ఎల్.రమణ కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరి చేత ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ ప్రమాణ స్వీకారం చేయించగా, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ