టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం నోముల నర్సింహయ్య తీవ్ర అస్వస్థతకు గురవ్వగా కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యుక్త వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ముందుగా సీపీఎం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. సీపీఎం పార్టీ తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నకిరేకల్ నియోజకవర్గం నుంచి 1999 మరియు 2004 లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఏపీ శాసనసభలో సీపీఎం పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు. ఇక 2013 లో టిఆర్ఎస్లో చేరారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నోముల నర్సింహయ్య మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు బుధవారం నాడు నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పని చేసిన నాయకుడిగా ఆయన నిలిచిపోతారని సీఎం అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ